Yashasvi Jaiswal : యశస్వి జైస్వాల్ ద్వి శతకం
రాజ్కోట్ టెస్టులో భారత యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ రెండో డబుల్ సెంచరీ కొట్టాడు. అరంగేట్రం బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ వరుసగా రెండో హాఫ్ సెంచరీ సాధించాడు. ఇద్దరూ దూకుడుగా ఆడుతున్న సమయంలోనే 430/4 వద్ద భారత కెప్టెన్ రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. దాంతో, ఇంగ్లండ్కు 557 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
మూడో రోజు టీ20 తరహా ఆటతో సెంచరీ బాదిన ఈ హిట్టర్.. నాలుగో రోజు ఇంగ్లండ్ బౌలర్లపై ఉప్పెనలా విరుచుకుపడ్డాడు. జో రూట్ బౌలింగ్లో సింగిల్ తీసి యశస్వీ ద్వి శతకం పూర్తి చేసుకున్నాడు. లంచ్ తర్వాత దూకుడు పెంచిన యశస్వీ.. జేమ్స్ అండర్సన్ బౌలింగ్లో హ్యాట్రిక్ సిక్సర్లతో తన తడాఖా చూపించాడు. తొలి సెషన్లో శుభ్మన్ గిల్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన ఈ డాషింగ్ బ్యాటర్ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. రెండో ఇన్నింగ్స్లో జైస్వాల్ 236 బంతులను ఎదుర్కొని 14 ఫోర్లు, 12 సిక్సర్ల సాయంతో 214 పరుగులతో అజేయంగా నిలిచాడు.తాజా ద్విశతకంతో యశస్వి జైస్వాల్ మరో ఘనత అందుకున్నాడు. వరుసగా రెండు టెస్టు మ్యాచుల్లో డబుల్ సెంచరీలు సాధించిన మూడో భారత ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. అతడి కంటే ముందు వినోద్ కాంబ్లీ, విరాట్ కోహ్లీ లు మాత్రమే ఇలా వరుసగా రెండు టెస్టుల్లోనూ ద్విశతకాలు చేశారు.
అరంగేట్రం బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్వరుసగా రెండో హాఫ్ సెంచరీ సాధించాడు. రెహాన్ అహ్మద్ బౌలింగ్లో సింగిల్ తీసి యాభై రన్స్ పూర్తి చేసుకున్నాడు. దాంతో, భారత్ 4 వికెట్ల నష్టానికి 412 పరుగులు చేసింది. ప్రస్తుతానికి టీమిండియా 538 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఓవర్నైట్ స్కోర్ 196/2 తో నాలుగోరోజు ఆట కొనసాగించిన భారత్ తొలి సెషన్లో రెండు వికెట్లు కోల్పోయింది. మూడో రోజు ఎంతో ఓపికగా ఆడినప్పటికీ శుభ్మన్ గిల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. నైట్ వాచ్మన్ కుల్దీప్ యాదవ్(27)తో సమన్వయ లోపంతో అతడు రనౌట్గా వెనుదిరిగాడు. ఆ కాసేపటికే కుల్దీప్ను రెహాన్ అహ్మద్ పెవిలియన్ పంపాడు. ఆ తర్వాత యశస్వీతో జత కలిసిన సర్ఫరాజ్ ధాటిగా ఆడాడు. వీళ్లిద్దరూ ఐదో వికెట్కు 172 పరుగులు జోడించారు. దాంతో, రోహిత్ సేన భారీ ఆధిక్యం సాధించింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com