బతుకమ్మ వేడుకలను తలపించేలా తీజ్ పండగ సంబరాలు
యాదాద్రి భువనగిరి జిల్లా గిరిజన తండాల్లో తీజ్ పండగ సంబరాలు అంబరాన్నంటాయి. సంప్రదాయ నృత్యాలతో తీజ్ సంబరాల్లో మునిగి తేలుతున్నారు గిరిజనులు. బతుకమ్మ వేడుకలను తలపించేలా తండాల్లో జరిగే ఈ ఉత్సవాలు గిరిజనులకు ఎంతో ప్రత్యేకమైనది. ఈ తీజ్ వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే గొంగడి సునీత కూడా పాల్గొన్నారు.
వర్షాకాలం ప్రారంభంతోనే తండాల్లో తీజ్ ఉత్సవాలు మొదలవుతాయి. గిరిజన సంప్రదాయానికి ప్రతీక అయిన ఈ వేడుకను ఆషాఢ శ్రావణ మాసాల్లో నిర్వహిస్తుంటారు. యువతులకు వివాహం జరగాలని.. వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండాలని.. చిన్నాపెద్దా అంతా ఆరోగ్యంగా ఉండాలంటూ ప్రతీ ఏటా ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు.
బతుకమ్మలాగే మొత్తం 9 రోజుల పాటు తీజ్ పండుగను జరుపుకుంటారు గిరిజనులు. యువతుల చేతుల మీదుగానే పెద్దలు ఈ ఉత్సవాలను కొనసాగిస్తారు. పండుగ సందర్భంగా యువతుల ఆటపాటలతో తండాలు సందడిగా మారాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com