Congress Manifesto : తెలంగాణ ప్రజలకు టీ కాంగ్రెస్ కొత్త వరాలు

Congress Manifesto : తెలంగాణ ప్రజలకు టీ కాంగ్రెస్ కొత్త వరాలు
ఆరు గ్యారంటీలకు తోడు కొత్త పథకాలు

తెలంగాణలో సబ్బండ వర్గాలను ఆకర్షించడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో సిద్ధం చేసింది. తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమ అమరవీరుల కుటుంబ సభ్యులకు.. నెలకు 25 వేల పింఛన్‌, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం హామీ ఇస్తారని... సమాచారం. తెలంగాణ ఉద్యమ కారులపై కేసులు ఎత్తివేసి 250 గజాల ఇళ్ల స్థలాలు కేటాయింపు హామీ ఇవ్వనున్నట్లు తెలిసింది. రైతులకు ఏకకాలంలో 2 లక్షల రూపాయల పంట రుణమాఫీతో పాటు 3 లక్షలు వడ్డీ లేని రుణాలు, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తామని స్పష్టత ఇస్తారని సమాచారం.

ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ వరాల జల్లు కురిపిస్తోంది. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఆరు గ్యారంటీలకు తోడు మ్యానిఫెస్టోలో కొత్త పథకాలను ప్రవేశపెట్టనుంది. కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించిన ఆరు గ్యారంటీలకు తోడుగా ఇప్పుడు మ్యానిఫెస్టో ప్రకటించనున్న కొత్త అంశాలు కూడా ఆసస్తికరంగా మారాయి. తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టో నేడు విడుదల కానుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గాంధీ భవన్ లో మ్యానిఫెస్టోలో విడుదల చేయనున్నారు.

ధరణి స్థానంలో 'భూమాత' పోర్టల్‌, 'ల్యాండ్ కమిషన్‌' ఏర్పాటునకు హామీ ఇస్తారని సమాచారం. బెల్ట్ షాపుల తొలిగింపు, రేషన్ కార్డులపై సన్న బియ్యం సరఫరా, గల్ఫ్ కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటుకు హామీ ఇస్తారని తెలుస్తోంది. బడ్జెట్‌లో విద్యారంగం వాటా 6 నుంచి 15 శాతానికి పెంపు, మూతబడిన 6వేల పాఠశాలలను పునః ప్రారంభించడం, మరో 4 ట్రిపుల్ ఐటీలు, ప్రతి జిల్లాకు రెసిడెన్షియల్ స్పోర్ట్స్ స్కూళ్లు, బస్తీ పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటుకు హామీ ఇస్తారని...సమాచారం. వార్షిక జాబ్ క్యాలెండర్‌ ద్వారా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, ఆరు నెలల్లోమెగా DSC, విద్యార్థులకు ఉచిత ఇంటర్నెట్‌ కల్పిస్తామని ప్రకటించనున్నట్లు తెలిసింది. సింగరేణిలో కారుణ్య నియామకాలు సరళీకృతం, ప్రభుత్వ ఆసుపత్రులు, ఉస్మానియా ఆసుపత్రి ఆధునికీకరణ, ఆరోగ్యశ్రీలో మోకాలు సర్జరీని చేర్చడం వంటి హామీలు ఇస్తారని సమాచారం. CPS రద్దుచేసి OPS పద్ధతి అమలుకు హామీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. వచ్చే PRCలో RTC ఉద్యోగులను చేర్చుతామని. చెప్పనున్నట్లు సమాచారం. జూనియర్ న్యాయవాదులకు నెలకు 5 వేల గౌరవ భృతి హైదరాబాద్ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వనున్నట్లు తెలిసింది. ప్రతి ఆటో డ్రైవర్‌కు ఏడాదికి 12వేలు ఆర్థికసాయం చేస్తామని కూడా చెప్పనున్నట్లు సమాచారం. SC వర్గీకరణ అనంతరం..మాదిగ, మాల, ఇతర ఎస్సీ ఉపకులాలకు కొత్తగా 3కార్పొరేషన్లు ఏర్పాటు, బీసీ “కుల గణన” బీసీ సబ్ ప్లాన్, ఈబీసీల కొరకు ప్రత్యేక సంక్షేమబోర్డు, మైనారిటీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేయనున్నట్లు చెబుతారని సమాచారం. నిరుపేద హిందూ, మైనారిటీ ఆడపడుచుల పెళ్లికి.. లక్ష రూపాయలతో పాటు ఇందిరమ్మ కానుకగా 10 గ్రాముల బంగారం ఇస్తామని ప్రకటిస్తారని తెలిసింది.

Tags

Read MoreRead Less
Next Story