BJP : ప్రతి ఇంటిపై కాషాయ జెండా.. శ్రీరామనవమికోసం బీజేపీ సంకల్పం
తెలంగాణ లోక్ సభ ఎన్నికల సమయంలో వస్తున్న శ్రీరామనవమిని అంగరంగ వైభవంగా జరిపేందుకు బీజేపీ శ్రేణులు సిద్ధమయ్యాయి. అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ట తర్వాత వస్తున్న తొలి శ్రీరామ నవమి కావడంతో.. భారీస్థాయిలో పండుగ వాతావరణం ఉండేలా ఏర్పాట్లు చేస్తోంది బీజేపీ. ఆరోజు ప్రతి వీధి.. ప్రతి ఊరు.. కాషాయమయం చేయాలని సంకల్పించింది.
ఏప్రిల్ 17వ తేదీన బుధవారం శ్రీరామనవమి పర్వదినం ఉంది. ఆరోజు ప్రతి హిందూ ఇంటిపై కాషాయ జెండాను ఏర్పాటు చేయాలని బీజేపీ నిర్ణయించింది. నవమి రోజు ప్రత్యేకంగా శ్రీరామ శోభాయాత్ర నిర్వహించనుంది. ప్రతి బూత్ లెవెల్లో రామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫ్లెక్లీలూ, జెండాలు కట్టాలని నిర్ణయించారు. ఇంటింటికీ బీజేపీ అనే నినాదంతో కమలనాథులు మేనిఫెస్టో అంశాలను సంకల్ప పత్రం రూపంలో అందిస్తున్నారు.
శ్రీరామ నవమి వేడుకల్లో బీజేపీ అనుబంధ సంఘాలతో పాటు సంఘ పరివార క్షేత్రాలకు చెందిన వారు భాగస్వాములు కానున్నారు. కార్యకర్తలు, నాయకులు కాషాయ కండువాలు మాత్రమే ఉపయోగించాలని, పార్టీ కండువాలు వాడొద్దని బీజేపీ నాయకత్వం సూచించింది. ఇదే సమయంలో బీజేపీ చేసిన అభివృద్ధిని కూడా ప్రజలకు వివరించాలని నిర్ణయించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com