REVANTH: మెట్రో విస్తరణపై రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు

REVANTH: మెట్రో విస్తరణపై రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు
మెట్రోరైల్‌పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సుదీర్ఘ సమీక్ష....ఔటర్‌ రింగ్‌ రోడ్ వెంట ఎయిర్‌పోర్ట్ మెట్రో ప్రణాళికలు నిలిపేయాలని ఆదేశం

ఔటర్‌ రింగ్‌ రోడ్ వెంట ఎయిర్‌పోర్ట్ మెట్రో ప్రణాళికలు, టెండర్ ప్రక్రియ నిలిపివేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. రాయదుర్గం-శంషాబాద్‌ మెట్రోమార్గం ఆపేసి పాతబస్తీ, LB నగర్ మార్గాలు ప్రత్యామ్నాయంగా అలైన్‌మెంట్‌ తయారు చేయాలని స్పష్టం చేశారు. కాలుష్యాన్ని వెదజల్లే ఫార్మాసిటీ హైదరాబాద్‌కు సమీపంలో ఉండాల్సిన అవసరం లేదని కందుకూరు సమీపంలో సేకరించిన భూముల్లో పర్యావరణహిత మెగా టౌన్‌షిప్‌ను అభివృద్ధి చేయాలని తెలిపారు. హైదరాబాద్ మెట్రోరైల్‌పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. విస్తరణ ప్రణాళికలు, ఎయిర్‌పోర్ట్ మెట్రో ప్రాజెక్టు, సంబంధిత అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఔటర్‌రింగ్‌ రోడ్డు వెంట ఎయిర్‌పోర్ట్ మెట్రో అలైన్‌మెంట్‌ రూపొందించడంపై రేవంత్‌రెడ్డి విస్మయం వ్యక్తం చేశారు. 111 G.O వల్ల అభివృద్ధికి చాలా తక్కువ అవకాశం ఉండటంతోపాటు ఇప్పటికే మంచి రవాణా సదుపాయం ఉన్న ప్రాంతంలో ఈ అలైన్‌మెంట్‌ ఎలా రూపొందించారని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో రాయదుర్గం నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం వరకు నిర్మించాల్సిన మెట్రో అలైన్‌మెంట్‌ ప్లాన్, టెండర్ ప్రక్రియ నిలిపివేయాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ మధ్యభాగం, తూర్పు ప్రాంతం, పాతబస్తీలో ఎక్కువ జనాభా ఉన్నందున వారి సౌలభ్యం కోసం మెట్రోరైల్‌ ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.


MGBS - ఫలక్‌నుమా, L.B నగర్ - చాంద్రాయణగుట్ట ప్రత్యామ్నాయ మార్గాలుగా అలైన్‌మెంట్‌ రూపొందించాలని CM స్పష్టం చేశారు. మైలార్‌దేవులపల్లి, జల్‌పల్లి మీదుగా ఒక ప్రత్యామ్నాయం... బార్కాస్, పహాడీ షరీఫ్, శ్రీశైలం రోడ్‌ మీదుగా మరో ప్రత్యామ్నాయం రూపొందించాలని మెట్రో రైల్ MDని ఆదేశించారు. ఒంపులు లేకుండా నేరుగా ఉండే మార్గం ద్వారా వ్యయం తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. విమానాశ్రయ ప్రాంతంలో ప్రభుత్వ భూములు ఉండటం వల్ల భారం తగ్గుతుందని CM తెలిపారు. L&T సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో రాయితీలు ఇచ్చినప్పటికీ పాతబస్తీ ప్రాంతంలోని ఐదున్నర కిలోమీటర్ల మేర మెట్రో రైల్‌ చేపట్టకపోవడంపై రేవంత్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ చేయాలని సీనియర్ అధికారులను ఆదేశించారు. L&T మెట్రో రైల్ లిమిటెడ్, GMR ఎయిర్‌పోర్ట్‌కు ఇచ్చిన రాయితీ ఒప్పందాలను ప్రభుత్వ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు.

నలువైపులా హైదరాబాద్‌ అభివృద్ధి చెందడంతో పాటు సమానంగా విస్తరించాల్సిన అవసరం ఉందని CM అభిప్రాయపడ్డారు. సంక్షేమ పథకాలతో పాటు హైదరాబాద్‌ అభివృద్ధిని సమపాళ్లలో తీసుకుపోవాలనేది ప్రభుత్వ ఆలోచన అని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే 40 శాతం పట్టణీకరణ జరిగిందని.. భవిష్యత్‌లో రెండు కోట్లు, తర్వాత మూడు కోట్ల జనాభా అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్ అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలిపారు. మూసీ సుందరీకరణ, నది తీరాన రైట్ అప్ వే ఉపయోగించుకునేలా మంచి మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించాలని ఆదేశించారు. నాగోల్ నుంచి గండిపేట వరకు ఈస్ట్-వెస్ట్ రోడ్ కం మెట్రో రైల్ కనెక్టివిటీ ఉండేలా చూడాలన్నారు. పశ్చిమ, గల్ఫ్ దేశాలు, ఆగ్నేయాసియాకు లాజిస్టిక్స్, మెడికల్ హబ్‌గా హైదరాబాద్‌కు ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులకు సూచించారు. రాష్ట్రానికి సముద్రం లేనందున డ్రై పోర్టు కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని CM స్పష్టం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story