హైదరాబాద్ లో ఇవాళ రేపు కూడా భారీ వర్షాలు : ఐఎండీ
భారీ వర్షాలు, వరదలతో భాగ్యనగరం అతలాకుతలమైంది. వందేళ్లలో ఎప్పుడూ చూడని కుండపోత వర్షం విశ్వరూపం చూపిస్తోంది. నిన్నటినుంచి మళ్లీ వర్షం కురుస్తోంది. ఇవాళ రేపు కూడా భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. అటు ఈ వరదల్లో హైదరాబాద్ వాసుల బాధలు వర్ణణాతీతం. ఉరుములు, మెరుపులతో హడలెత్తిస్తోంది. డ్రైనేజీలు పొంగిపొర్లాయి. నాలాలు నోరు తెరిచాయి.. ప్రధాన రహదారులు చెరువులను తలిపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జల మయమయ్యాయి.. ఎక్కడ చూసిన వరద.. బుదర కష్టాలే కనిపిస్తున్నాయి..
నగర ప్రజలు ఎవరూ ఇళ్లలోంచి బయటకు రావొద్దని హెచ్చరించింది ప్రభుత్వం. అటు... పాత భవనాలు భయపెడుతున్నాయి.. ఎప్పుడు భారీ వర్షాలు కురిసినా.. ఆ పాత భవనాలు కూలి కొందరు ప్రాణాలు కోల్పోవలసి వస్తోంది. దీంతో GHMC అధికారులు ముందుగానే అలర్ట్ అయ్యారు. శిథిలావస్థకు చేరిన భవనాలను గుర్తించి కూల్చివేస్తున్నారు.. నాచారం, కాప్రాలో శిథిలావస్తకు చేరిన భవనాల దగ్గరుండి GHMC అధికారులు కూల్చివేశారు.
నాలాల్లో పేరుకుపోయిన చెత్తను యుద్ధ ప్రాతిపాదికన తొలగించే చర్యలు చేపట్టారు. చెత్త తీస్తూఉంటే ఆటోలు, బైకులు బయటకు వస్తున్నాయి.. అటు వరద ప్రభావిత ప్రాంతాల్లో సేవలందించేందుకు బోట్లు సిద్ధంగా ఉన్నాయి. నీటమునిగిన కాలనీల్లో సేవలను కొనసాగించేందుకు ఏపీ, తెలంగాణ టూరిజానికి చెందిన 40 బోట్లను హైదరాబాద్కు తరలించారు. భారీ వర్షాల కారణంగా... రాష్ట్రంలో పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది విద్యాశాఖ..
మంత్రి కేటీఆర్ వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. నిరాశ్రయులుగా ఉన్న కుటుంబాలకు స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ తో కలిసి బాధితులకు ఆర్ధిక సహాయాన్ని అందించారు. టౌలి చౌకీ డివిజన్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, స్థానిక నేతలతో కలిసి వరద బాధితులకు సహాయం అందించారు. ఒక్కో కుటుంబానికి పదివేల రూపాయలను అందజేశారు.
ఆర్ధిక సహాయం తాత్కాలిక సహామేనని, వరదల్లో ఇళ్లు పాక్షికంగా.. లేదా పూర్తిగా నష్టపోతే వారికి మరింత సహాయం అందిస్తామన్నారు మంత్రికేటీఆర్. వర్షాల వల్ల ఇబ్బంది పడుతున్న విపత్కర పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు రెసిడెన్షియల్ వెల్ఫెర్ అసోసియేషన్లు, ఎన్జీవోలతో కలిసి ప్రజలకు సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. రానున్న మరో మూడు రోజులు భారీ వర్షాలుకురిసే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు.
మరోవైపు .... ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. మరో 48 గంటల పాటు వాయువ్య దిశగా అల్పపీడనం కొనసాగనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. వాయువ్య దిశ తరువాత ఉత్తర ఈశాన్యంగా పయనిస్తుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో మరో 2 రోజుల పాటు హైదరాబాద్, కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com