Nizam Sugars: అవసరానికి అక్కరకు రాని నిజాం చక్కెర కర్మాగారం భూములు

Nizam Sugars: అవసరానికి అక్కరకు రాని నిజాం చక్కెర కర్మాగారం  భూములు
ఆందోళనారో యజమానులు

నిజాం చక్కెర కర్మాగారం భూములు కొనుగోలు చేసిన రైతులు తిరిగి అమ్ముకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. రెవెన్యూ శాఖ జారీ చేసిన పట్టాలున్నా.. ధరణిలో స్లాట్ బుక్కవుతున్నా తహసీల్దార్లు మాత్రం రిజిస్ట్రేషన్లకు అంగీకరించడం లేదు. కోర్టు ఆర్డర్‌ తెచ్చుకుంటేనే రిజిస్ట్రేషన్ చేస్తామని మెలిక పెడుతున్నారు. పాతికేళ్ల కిందట కొన్న భూములకు రెండున్నరేళ్ల కిందటి వరకు క్రయ విక్రయాలు జరిగినా ఇప్పుడు అభ్యంతరం చెప్పండమేంటని ప్రశ్నిస్తున్నారు.

నిజాం చక్కెర కర్మాగారం భూములను పదవీ విరమణ పొందిన కార్మికులకు గ్రాట్యుటీలో కొంత మినహాయించుకొని కేటాయించారు. మరికొందరికి వేలం ద్వారా అమ్మారు. ఇంకొందరికి వివిధ కార్పొరేషన్ల ద్వారా 'వ్యవసాయ భూమి కొనుగోలు పథకం' కింద రాయితీ రుణాలు అందించి మరీ విక్రయించారు. భూమి కొనుగోలు కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్‌ల రుణాలతో 8 వేల345 ఎకరాలను కొనుగోలు చేయించారు. మొదటి రెండు పద్ధతుల్లో భూమి తీసుకున్న వారికి ఇబ్బందుల్లేవు . ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు బ్యాంకు రుణాలతో కొనుగోలు చేసిన వారికి చిక్కొచ్చి పడింది. ఎకరానికి 20 వేల చొప్పున పాతికేళ్ల కిందట అప్పగించారు. రుణ బకాయిలు తీరాక భూమిపై సర్వ హక్కులు కల్పించారు. పట్టాలు జారీ అయ్యాయి. రైతు బంధు సొమ్ము జమతో పాటు ప్రభుత్వ పథకాలన్నీ వర్తిస్తున్నాయి. రిజిస్ట్రేషన్లు మాత్రం చేయటం లేదు.

కేవలం ఉన్నతాధికారుల మౌఖిక ఆదేశాలతోనే రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు. కోర్టుకు వెళ్లి ఆర్డరు తెచ్చుకున్న వారికి ఎలాగోలా చేస్తున్నారు. సదరు భూములు మాత్రం నిషేధిత జాబితాలో లేవు. కోర్టు ఖర్చులు, అధికారులు పెట్టే తిప్పలు భరించలేని వారు రెవెన్యూ ఉద్యోగులను సంప్రదించగా ఇటీవల కొన్ని రిజిస్ట్రేషన్లు చేసినట్లు ఆరోపణలున్నాయి. రెండున్నరేళ్ల కిందటి వరకు క్రయవిక్రయాలకు అనుమతించిన అధికారులు ఇప్పుడు అభ్యంతరం చెబుతున్నారు.

రెండున్న రేళ్ల కిందట నుంచి రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు. దీనిపై కొందరు రైతులు కోర్టుకు వెళ్లటం, అక్కడ రెవెన్యూ అధికారులు ఎస్సీ అభివృద్ధిశాఖ లేఖ కారణంగానే రిజిస్ట్రేషన్లు నిలిపి వేసినట్లు చెప్పగా.. కోర్టు ఈ వాదనను సమర్థించలేదు . రుణ సహాయంతో కొనుగోళ్లుజరిగాయని... ఇంతకాలం క్రయ విక్రయాలకు అనుమతించారని పైగా ప్రభుత్వం ఉచితంగా ఇచ్చినవి కావని, నిషేధిత జాబితాలో లేవని కోర్టు తెలిపింది. ఉన్నత స్థాయి నుంచి ఎలాంటి అదేశాలు లేకుండా రిజిస్ట్రేషన్లు నిలిపివేసే నిర్ణయం సరికాదని బాధితుల హక్కులు హరించినట్లు అవుతుందని స్పష్టం చేసింది. దీంతో కోర్టుకు వెళ్లిన వారికి రిజిస్ట్రేషన్లు చేయక తప్పలేదు.

NSF భూముల రిజిష్ట్రేషన్లు నిలిచిపోవడం వల్ల ఆపద సమయంలో, అవసరానికి అమ్ముకోవడానికి వీల్లేకుండా పోయింది. భూమి ఉన్నా..అవసరానికి నిరుపయోగంగా మారడం పట్ల భూ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story