సురేష్ ప్రొడక్షన్స్ లోగోపై ఉన్న ఆ చిన్నారులు ఎవరో తెలుసా?
సురేష్ ప్రొడక్షన్స్ .. తెలుగు సినిమాను ఓ స్థాయికి తీసుకెళ్లడంలో ఆ బ్యానర్ పాత్ర అనిర్వచనీయం. ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని ఆ నిర్మాణ సంస్థ పలు విజయవంతమైన చిత్రాలను తీసి భారతీయ సినిమా పరిశ్రమలో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకుంది. సురేష్ ప్రొడక్షన్స్ను స్థాపించిన మూవీ మొఘల్ డి.రామానాయుడు ఆ బ్యానర్పై అత్యధిక సినిమాలు నిర్మించి.. స్టార్ ప్రొడ్యూసర్గా చిత్ర పరిశ్రమలో నిలిచిపోయారు. ప్రస్తుతం ఆ బ్యానర్ను రామానాయుడు తనయుడు సురేష్బాబు కొనసాగిస్తున్నారు.
సురేష్ ప్రొడక్షన్స్ సంబంధించిన సినిమా టీవీలో వస్తుందంటే చాలు ముందుగా వచ్చే ఓ లోగో అందరిని ఆకర్షిస్తుంది. దాన్ని చూడగానే అది సురేష్ ప్రొడక్షన్స్ సినిమా అని ఠక్కున గుర్తు పట్టేయొచ్చు. అయితే ఇప్పుడు ఆ లోగోకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఎస్పీ అనే లెటర్స్పై కనిపించే ఇద్దరు చిన్నారులు వేరెవరో కాదు. ఒకరు సురేష్బాబు కాగా, మరొకరు అగ్ర కథానాయకుడు వెంకటేష్. ఈ లోగో వెనుక ఉన్న కథను సురేష్బాబు బయటపెట్టారు.
"సురేష్ ప్రొడక్షన్స్ లోగోలో కనిపించే ఇద్దరు పిల్లల్లో ఒకరు నేను. ఇంకొకరు తమ్ముడు వెంకటేష్. ప్రొడక్షన్ లోగో కోసం ఎస్.పి. అనే అక్షరాలు తయారు చేశారు.అది మరింత ఆకర్షణీయంగా కనిపించేలా ఉండేందుకు పి’పై లెటర్పై నన్ను,‘ఎస్’పై వెంకటేష్ను నిలబెట్టారు. ‘ఎస్’ లెటర్ తగట్టుగానే వెంకటేష్ స్టార్ హీరో అయ్యాడు. పి’పై ఉన్న నేను ప్రొడ్యూసర్ అయ్యా అని నవ్వుతూ' ఈ లోగో వెనుక ఉన్న కథను సురేష్బాబు ఓ సందర్భంలో సంచుకున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com