TS ASSEMBLY: తెలంగాణ శాసనసభ వాయిదా

TS ASSEMBLY: తెలంగాణ శాసనసభ వాయిదా
మేడిగడ్డకు కేసీఆర్‌ రావాలన్న సీఎం రేవంత్

తెలంగాణ శాసనసభ సమావేశాలు వాయిదా పడ్డాయి. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు మేడిగడ్డ బ్యారేజీ వెళ్లానున్నారు. దీంతో అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. నిజానికి ఈరోజు ఓట్ ఆన్ అకౌంట్‌పై చర్చ జరగాల్సి ఉండగా... చర్చను వాయిదా వేసి మేడిగడ్డ పర్యటనకు వెళ్లేలా ప్రభుత్వం ప్లాన్ సిద్ధం చేసింది. ఈ క్రమంలో ఈరోజు ఉదయం సభ మొదలైన కాసేపటికే వాయిదా పడింది. ఆపై మేడిగడ్డ సందర్శనకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరి వెళ్లారు.

కాళేశ్వరంపై అన్ని రకాలుగా పూర్తి స్థాయి సమీక్ష జరిగిందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఇప్పటికే మంత్రుల బృందం మేడిగడ్డను పరిశీలించిందని.. భారీ నష్టం జరిగిందనే అంచనాతోనే విజిలెన్స్ విచారణకు ఆదేశించామని చెప్పారు. మేడిగడ్డకు తాము మాత్రమే కాకుండా బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, సీపీఐ సభ్యులను ఆహ్వానించామన్నారు. మేడిగడ్డ నిర్మాణంలో తప్పిదాలు ఉన్నాయని డ్యామ్ సేఫ్టీ అథారిటీ స్పష్టంగా పేర్కొందన్నారు. కాంగ్రెస్ హాయాంలో కట్టిన ప్రాజెక్టులు 40, 50 ఏళ్ళు అవుతున్నా చెక్కు చెదరకుండా ఉన్నాయని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వంలో ప్రజాధనం దుర్వినియోగం అయిందని విజిలెన్స్ రిపోర్ట్‌లో తేలిందని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.

కృష్ణా జలాలపై సోమవారం చర్చించామని.. వాస్తవాలు చెప్పామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సాగునీటి ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలన్నారు. ప్రాజెక్టుల వల్లే కరువ ప్రాంతాల్లోనూ పంటలు పండిస్తున్నామని తెలిపారు. ప్రజల ఆకాంక్షల మేరకే ప్రాణహిత - చెవెళ్ల ప్రారంభించామన్నారు. వెంకటస్వామి సూచన మేరకు ప్రాణహిత - చేవెళ్లకు అంబేద్కర్ పేరు పెట్టినట్లు చెప్పుకొచ్చారు. బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ ఖజానా డబ్బు వృథా అయ్యిందని విమర్శించారు. గత ప్రభుత్వంలో ఇష్టారాజ్యాంగా ప్రాజెక్టుల నిర్మాణాలు జరిగాయని తెలిపారు. న్యాయం చేయాలంటూ ఇప్పటికీ భూ నిర్వాసితులు కోరుతున్నారన్నారు. గత ప్రభుత్వం రీ-డిజైనింగ్ అనే బ్రహ్మపదార్థం కనిపెట్టిందని వ్యాఖ్యలు చేశారు. మేడిగడ్డపై విజిలెన్స్ నివేదక ఇచ్చిందన్నారు. ప్రాజెక్ట్ నిర్మాణంలో ఎన్నో లోపాలున్నాయని చెప్పారు. ఇసుక కుంగడం వల్లే మేడిగడ్డ కుంగిందంటున్నారని అన్నారు. రూ.35 కోట్ల అంచనాలతో ప్రారంభించిన ప్రాజెక్టును రూ.లక్షా 47వేల కోట్లకు పెంచారన్నారు. మేడిగడ్డ నిర్మాణంలో ఇసుకతో పేకమేడలు నిర్మించారా అని ప్రశ్నించారు. అక్కడ ఏం జరిగిందో ఎవరికీ ఎలాంటి సమాచారం లేదని సీఎం తెలిపారు.

సభ వాయిదా పడిన తర్వాత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మేడిగడ్డకు బయల్దేరారు. అసెంబ్లీ నుంచి ప్రత్యేక బస్సుల్లో ప్రజాప్రతినిధులు పయనమయ్యారు. మేడిగడ్డ విజిట్ కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం మూడు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయగా... సీఎం రేవంత్ రెడ్డి కోసం ప్రత్యేకంగా మరో బస్‌ను ఏర్పాటు చేశారు. అయితే మేడిగడ్డ విజిట్‌కు బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు దూరంగా ఉన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story