జూన్ లోనూ దంచికొడుతున్నఎండలు.. వాతావరణ శాఖ అలర్ట్
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. మే నెల ముగిసినా ఎండల తీవ్రత మాత్రం తగ్గడంలేదు. ఏప్రిల్, మే నెలల్లో వాతావరణ శాఖ హీట్ వేవ్ అలర్ట్ లు జారీ చేయడం మామూలే. కానీ, ఈసారి అసాధారణంగా జూన్ మొదటి వారంలో ఐఎండీ హీట్ వేవ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలోని 13 జిల్లాల్లో వచ్చే నాలుగు రోజులు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది. తెలంగాణతో పాటు బెంగాల్, ఛత్తీస్ గఢ్, సిక్కింలలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు.
మరోవైపు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఎండ వేడికి జనం విలవిలలాడిపోతున్నారు. హైదరాబాద్తో పాటు మహబూబాబాద్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. తీవ్రమైన ఉక్కపోత ఉండటంతో జనం అల్లాడిపోతున్నారు. రోజుల వ్యవధిలోనే ఉష్ణోగ్రతల్లో భిన్నమైన మార్పులు వస్తున్నాయి.
మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. మూడు రోజుల పాటు పలు జిల్లాలకు వాతావరణ శాఖ హీట్ వేవ్ అలర్ట్ జారీ చేసింది. వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని ప్రజలకు సూచించింది. అత్యవసర పరిస్థితులలో బయటకు వెళ్లేవారు వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com