YS Sharmila: క్లైమాక్స్‌కు YSRTP విలీన ప్రక్రియ

YS Sharmila: క్లైమాక్స్‌కు YSRTP విలీన ప్రక్రియ


కాంగ్రెస్‌లో వైఎస్ఆర్‌టీపీ విలీన ప్రక్రియ క్లైమాక్స్‌కు చేరుకుంది. హస్తిన వేదికగా పార్టీ విలీనానికి ..షర్మిల వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే పార్టీ అగ్రనాయకులతో సమావేశమై చర్చించారు. మరో వైపు వైఎస్‌ఆర్‌టీపీ విలీన వ్యవహారం టి.కాంగ్రెస్‌లో దుమారం రేపుతోంది. షర్మిల తెలంగాణలో రాజకీయం చేయడాన్ని రేవంత్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. షర్మిల ఎన్నికల బరిలో నిలిచినా.. ప్రచారానికి వచ్చినా..తెలంగాణలో కాంగ్రెస్‌కు నష్టం జరుగుతుందని ఆయన వాదిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ మరోసారి ఆంధ్రా పెత్తనం నినాదాన్ని తెరపైకి తెచ్చి.. రాజకీయంగా వాడుకుంటుందని చెబుతున్నారు.

షర్మిల చేరిక విషయంలో కొంత మంది కాంగ్రెస్‌ సీనియర్ల వాదన మరోలా ఉంది. ఆమె చేరిక పార్టీకి బలమని వాదిస్తున్నారు. షర్మిల కాంగ్రెస్‌లోకి రావాలని కోరుకుంటున్నారు. ఇదే విషయాన్ని బాహాటంగానే చెబుతున్నారు. షర్మిల పార్టీ విలీనం వ్యవహారాన్ని ఢిల్లీ కాంగ్రెస్‌ పెద్దలు నేరుగా డీల్‌ చేస్తున్నారు. తెలంగాణ, ఏపీ కాంగ్రెస్‌ నేతలతో సంబంధం లేకుండానే హైకమాండ్‌ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

షర్మిల కాంగ్రెస్‌లో చేరితే తెలంగాణలో పోటీ చేస్తుందా?... షర్మిలకు ఏపీ కాంగ్రెస్‌ బాధ్యతలు అప్పగిస్తారా?.. లేదంటే ఏఐసీసీ పదవి ఇచ్చి తెలుగు రాష్ట్రాల్లో తిప్పుతారా?... ఇలా షర్మిల ఎంట్రీపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు జగన్ సర్కార్‌పై షర్మిల ఎప్పుడూ మాట్లాడలేదు. కేసీఆర్ టార్గెట్‌గానే షర్మిల విమర్శలు చేస్తూ వస్తున్నారు. కాంగ్రెస్‌లో చేరిక తర్వాత షర్మిల వాయిస్‌ ఎలా ఉండబోతున్నది ఉత్కంఠరేపుతుంది.

Read MoreRead Less
Next Story