Pakistan : అడుక్కోవడం మానేద్దాం..
పాకిస్థాన్ ఇతర దేశాల రుణాలపై ఆధారపడటం మానేయాలని ఆ దేశ ఆర్మీచీఫ్ జనరల్ ఆసిం మునీర్ హితబోధ చేశారు. దేశ ప్రజలు ఉత్సాహవంతులు, ప్రతిభావంతులు కాబట్టి ఇకపై సొంతకాళ్లపై నిలబడటం నేర్చుకోవాలని పేర్కొన్నారు. పాకిస్తాన్ గత కొంతకాలంగా ఆర్ధిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే. పరిస్థితి ఎప్పటికి కుదుటపడుతుందో తెలీయని అనిశ్చితిలో దొరికిన చోటల్లా అప్పు కు సిద్ధం అయిపోతోంది దాయాది దేశం.
తాజాగా తన మిత్ర దేశమైన చైనా దగ్గర ఇంకొంత ఋణం తీసుకునేందుకు అంతా ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు సయ్యద్ అసీం మునీర్ స్పందిస్తూ మన చేతిలో ఉన్న చిప్పను అవతలకు విసిరేయాలన్నారు. ఖానేవాల్ మోడల్ అగ్రికల్చర్ ఫామ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన అన్ని రకాల శక్తులను పాక్ కు భగవంతుడు ఇచ్చాడని వాటిని సక్రమంగా వినియోగించు కోవాలి అన్నారు. స్వాభిమానంతో బ్రతకడం అలవాటు చేసుకోవాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ఆర్ధిక వ్యవస్థ బలపడేంత వరకు సైన్యం నిద్రపోకుండా పనిచేస్తుందని, అపార ప్రతిభావంతులను, ఉత్సాహవంతులైన వారిని చూసి పాకిస్తాన్ గర్విస్తోందని అన్నారు.
ఆర్ధికంగా కుదేలైపోయిన పాక్ ఒకపక్క ఉన్న ఆస్తులను అమ్ముకోవడంతో పాటు మరోపక్క రుణాల కోసం కూడా ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రయాణంలో భాగంగా ఇటీవలే ఐఎంఎఫ్ దగ్గర కొంత అప్పు తీసుకుంది. ఇప్పుడు మళ్లీ మిత్రదేశం చైనా దగ్గర మళ్ళీ చెయ్యి చాచింది.
చైనాకు పాకిస్తాన్ ఇప్పటికే 2.07 బిలియన్ డాలర్ల రుణపడి ఉండగా , తాజాగా తీసుకోనున్న మరో 600 మిలియన్ డాలర్ల రుణంతో కలిపి ఆ మొత్తం 2.44 బిలియన్ డాలర్లకు చేరనుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com