Israel-Hamas War: వెస్ట్ బ్యాంక్ శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ సైన్యం దాడి
పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులు (Israel) కొనసాగుతూనే ఉన్నాయి. వెస్ట్ బ్యాంక్లోని నూర్ షామ్స్ శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన ఆపరేషన్లో 14 మంది మరణించారు. ఈమేరకు పాలస్తీనా ఆరోగ్య శాఖ తెలిపింది. అయితే ఇజ్రాయెల్ ఆర్మీ మాత్రం పది మంది మిలిటెంట్లను హతమార్చినట్లు ప్రకటించింది. కాగా, 14 మంది అమరులను నూర్ ష్యామ్స్ క్యాంప్ నుంచి దవాఖానకు తరలించినట్లు పాలస్తీనియన్ రెడ్ క్రెసెంట్ వెల్లడించింది. అంతకు ముందు ఇజ్రాయెల్ దాడుల్లో 11 మంది గాయపడినట్లు పాలస్తీనా ఆరోగ్యశాఖ తెలిపింది.
ఇది కాకుండా, శనివారం దక్షిణాన గాజా నగరంలో ఒక ఇంటిపై ఇజ్రాయెల్ వైమానిక దాడిలో తొమ్మిది మంది మరణించారు. మృతుల్లో ఆరుగురు చిన్నారులు ఉన్నారు. గాజా సివిల్ డిఫెన్స్ ప్రకారం, రాఫా నగరానికి పశ్చిమాన టెల్ సుల్తాన్ ప్రాంతంలోని నివాస భవనాన్ని కూడా లక్ష్యంగా చేసుకుని శుక్రవారం ఆలస్యంగా దాడి జరిగింది. ఆసుపత్రి రికార్డుల ప్రకారం, ఆరుగురు పిల్లలు, ఇద్దరు మహిళలు, ఒక వ్యక్తి మృతదేహాలను రఫాలోని అబూ యూసఫ్ అల్-నజ్జర్ ఆసుపత్రికి తరలించారు. వారంతా ఒకే కుటుంబానికి చెందినవారని బంధువులు తెలిపారు. ఇజ్రాయెల్ దాడులతో వలస వెళ్లిన గాజా ప్రజల్లో సగం మంది ఈజిప్టుకు దగ్గరలో ఉన్న రఫాలోనే తలదాచుకుంటున్నారు. గతేడాది అక్టోబర్ 7 నుంచి గాజాలో ప్రాణాలు కోల్పోయిన పాలస్తీనియన్ల సంఖ్య 34,049కు చేరింది. మరో 76,901 మంది గాయపడ్డారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com